కరోనా వైరస్ విజృంభణ క్రమంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అందులో ముఖ్యంగా ఆహారం లభించాక చాలా మంది బాధపడుతున్నారు. అలాంటివారికి ఆహారం అందించేందుకు యాంకర్ సుమ విరాళాలు సేకరిస్తోంది. మొత్తం రూ.5 లక్షల విరాళాలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.3,91,000 వచ్చాయి.
మొత్తం 307 మంది ఈ విరాళాలు ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తాను ఇచ్చిన పిలుపుపట్ల ఇంతమంది స్పందించి విరాళాలు ఇచ్చినందుకుగానూ సుమ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్లో ఆమె అభిమానులతో మాట్లాడి విరాళాలు ఇవ్వాలని కోరింది. విరాళాల కోసం తాను ఇచ్చిన పిలుపునకు అభిమానులు బాగా స్పందించారంటూ కన్నీరు పెట్టుకుంది. ఇది కన్నీరు కాదని ఆనంద భాష్పాలని ఆమె కళ్లు తుడుచుకుంటూ తెలిపింది.
ఇలాంటి విపత్కర టైంలో తాము మాత్రమే బాగుండాలని అనుకోకుండా ఇతరుల ఆకలిని తీర్చుతున్నారని తెలిపింది. ఇంకా మానవత్వం బతికే ఉందని చాలా మంది నిరూపిస్తున్నారని తెలిపింది. ఇంత మంది స్పందిస్తుండడం తన హృదయాన్ని కదలిస్తోందని సుమ భావోద్వేగభరితంగా మాట్లాడింది. సుమ చేస్తున్న ఈ మంచి పనిని అందరు ప్రశంసిస్తున్నారు.