‘అల్లుడు శీను’ అనే సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ మొదట్లో వరుస డిజాస్టర్ లతో బోలెడు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎట్టకేలకు ఈ మధ్యనే విడుదలైన ‘రాక్షసుడు’ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు ఈ యువ హీరో. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు బెల్లంకొండ కుటుంబం నుంచి మరొక హీరో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. అతను ఎవరో కాదు బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు గణేష్.
‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన పవన్ సాధినేని ఇప్పుడు బెల్లంకొండ గణేష్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నభా నటేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. బెల్లంకొండ సురేష్ ‘అల్లుడు శీను’ విషయంలో ఎన్ని జాగ్రత్తలు వహించారో, తన రెండవ కుమారుడు బెల్లంకొండ గణేష్ మొదటి సినిమా విషయంలో కూడా అంతే జాగ్రత్తలు వహిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం బాగా పేరున్న నటీనటులు మరియు టెక్నీషియన్లను ఎంచుకోబోతున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.