తమిళ హీరో కార్తీ తాజా చిత్రం ‘దొంగ’ టీజర్ విడుదలైంది. దృశ్యం ఫేం మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళంలో ‘తంబి’ పేరుతో తీసిన ఈ చిత్రానికి తెలుగులో ‘దొంగ’ టైటిల్ పెట్టారు. ముందుగా ఈ సినిమాకు ‘తమ్ముడు’ టైటిల్ పెడతారని ప్రచారం జరిగింది. కానీ చివరకు ‘దొంగ’ టైటిల్ ఖరారు చేశారు. గతంలో తమ్ముడు పేరుతో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కార్తీకి అక్కగా ఆయన వదిన జ్యోతిక నటించారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కీలకపాత్రల్లో సత్యరాజ్, షావుకారు జానకి కనిపించనున్నారు. వయకామ్ 18, సూరజ్ సదన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నారు.
ఇటీవల విడుదలైన ‘ఖైదీ’ సినిమా కార్తీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ఖైదీ’, ‘దొంగ’ టైటిల్స్ రెండూ చిరంజీవి నటించిన సినిమా టైటిల్సే కావడం విశేషం. ఈ చిత్రం తెరకెక్కిన విధానం చాలా సంతృప్తికరంగా ఉందని, ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని హీరో కార్తీ విశ్వాసం వ్యక్తం చేశారు.