గరుడవేగ సినిమా ప్రమోషన్ వేడి పెరిగింది. ఈసినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ దస్పల్లా హోటల్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో రాజశేఖర్ తన మనో వేదనను వ్యక్తం చేయగా… ప్రవీణ్ సత్తారు తన ఆవేశాన్ని కక్కేశాడు. “ఒక పోలీసోడు రేప్ చేశాడని చెప్పకూడదు.. ఒక మంత్రిగార్ని తిరుగుబోతుగా చూపించకూడదు.. తెర మీద ఒక నెత్తుటి మరక కనిపించకూడదు.. ఆవేశంగా ఒక డైలాగ్ చెప్పకూడదు.. ఇలా తీస్తేనే సినిమానా..?” అంటూ వ్యవస్థను కడిగేశాడు.
క్రియేటివిటీని మాత్రమే కాదు.. సొసైటీ పట్ల కమిట్ మెంట్ ను కూడా చంపేస్తున్నారన్నది ఆయన ఆవేశం. తాను నీట్ గా తీసిన ‘గరుడవేగ’ సినిమాకు ‘యూ’ సర్టిఫికెట్ వస్తుందని ఆశించానని, తీరా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. టి. కృష్ణ లాంటి డైరెక్టర్లు ఇప్పుడు బతికుంటే.. ఈ సెన్సారోళ్లకు నచ్చినట్లు సినిమా తియ్యలేక మళ్ళీ చనిపోయేవారని.. ప్రవీణ్ ఆవేశంగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఏ కంటెంట్ వున్నా అడ్డంగా కత్తెర్లేసే సెన్సార్ బోర్డును ఎవరొచ్చినా బాగుపర్చలేరని ఓపెన్ గానే విమర్శించాడు.
నవంబర్ 3న రిలీజవుతున్న ఈ సినిమా ”నిజాయితీగల ఎన్ఐఎ ఆఫీసర్ దేశం కోసం, తన కుటుంబం కోసం ఏం చేశాడన్న కథాంశంతో’ తయారైంది. ఇందులో ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు, వ్యాఖ్యలు లేకపోయినప్పటికీ యూ సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని డైరెక్టర్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే.. ‘మెర్సల్’ మూవీతో ఫిలిం సెన్సారింగ్ వ్యవస్థ వార్తల్లోకెక్కిన నేపథ్యంలో ‘సత్తారు’ కామెంట్స్ టాలీవుడ్ లో రీసౌండ్ ఇస్తున్నాయి.