మొన్నటివరకు రిలీజ్ డేట్ సమస్యలతో ఇబ్బంది పడింది మహర్షి మూవీ యూనిట్. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 25కి మారి, ఆ తర్వాత మే 9కు వెళ్లిపోయింది ఆ మూవీ రిలీజ్ డేట్. అలా విడుదల తేదీపై ఓ క్లారిటీ వచ్చిందనుకునే టైమ్ కు మహర్షి సినిమాకు మరో సమస్య వచ్చిపడింది. ఈసారి డ్యూరేషన్ సమస్య మహర్షి టీమ్ను వెంటాడుతుందట. అవును.. మహర్షి సినిమా ఏకంగా 4 గంటల రన్ టైమ్ వచ్చిందట. ఒక్కసారి వంశీ పైడిపల్లి హిస్టరీ చూస్తే ఇదేం కొత్త సమస్య అనిపించదు. మున్నా నుంచి వంశీ స్టైల్ అంతే.రన్ టైమ్ చూసుకోకుండా సినిమా తీస్తూనే పోతాడు. ఫైనల్ గా ఎడిటింగ్ టేబుల్ పైన కూర్చొని కట్ చేస్తాడు. అవసరమైతే ఈ విషయంలో దిల్ రాజు సహాయం కూడా తీసుకుంటాడు వంశీ పైడిపల్లి. ఈసారి కూడా మేకర్స్ అదే పని చేయబోతున్నారు.
అయితే ఈసారి మాత్రం వ్యవహారం కాస్త కష్టంగా తయారైందట. 4 గంటల సినిమాను రెండున్నర గంటలకు కుదించాలంటే చాలా ఇబ్బందిగా ఉందట. ఏ సన్నివేశాలు తీసేసినా ఏదో ఒక వెలితి కనిపిస్తోందట. చివరికి 3 గంటల రన్ టైమ్ కోసం ట్రై చేసినా ఎడిటింగ్ కష్టమైపోతోందనే టాక్ వినిపిస్తోంది. ఆఖరి నిమిషంలో సన్నివేశాలు తీసేసి, సినిమాను ట్రిమ్ చేయడంలో దిల్ రాజు దిట్ట. మరి మహర్షి విషయంలో ఈ నిర్మాత ఏం చేస్తాడో చూడాలి.