రైతుల ఆత్మహత్య ఇతివృత్తంపై అన్నదాత సుఖీభవ సినిమా
పీపుల్స్ స్టార్ అంటే నారాయణ మూర్తి. ఆయన హావాభావాలు, డైలాగ్లు ప్రత్యేకం పోండి. ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలు, విప్లవ నేపథ్యంలో సినిమాలు తీస్తుంటాడు. అతడే హీరో, దర్శకుడు, ఒక్కోసారి నిర్మాతగా కూడా వ్యహరిస్తుంటాడు. ఎన్నో సినిమాలు సామాజిక అంశంపై తీస్తూ వెళ్తున్నాడు. తనదొక ప్రత్యేక పంథా. ఆయనకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. రైతుల దైన స్థితిపై ఆర్ నారాయణమూర్తి చలించారు.
ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా ‘అన్నదాత సుఖీభవ’. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా సోమవారం (డిసెంబర్ 11) హైదరాబాద్లో మాట్లాడారు. ‘‘రైతే రాజు అంటూ మాటలతోనే కడుపు నింపుతున్నారు. కానీ రైతుల ఆకలి తీరక, అప్పుల బాధల్ని తట్టుకోలేక అసంఖ్యాకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఆగేదెప్పుడనేదే తన ప్రశ్న అని తెలిపారు. అందర్నీ బతికించే రైతులు అర్థాంతరంగా తనువులు చాలిస్తుండడంపై కలత చెంది తాను సినిమా చేశానని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీని కల్పించాలని, పంటలకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని అప్పుడే రైతులు బతుకుతారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను ఆపాలని చెబుతూ అన్నదాత సుఖీభవ సినిమా తీసినట్లు వెల్లడించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఆయన తీస్తున్న సినిమాలో ఎనిమిది పాటలను గొప్ప కవులు రాశారని వారికి ధన్యవాదాలు ప్రకటించారు. త్వరలో పాటల్ని, ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాకు పాటలు వంగపండు ప్రసాదరావు, గద్దర్, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్తేజ తదితరులు రాశారు.