తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. జయలలిత పాత్రలో హీరోయిన్ నిత్యా మీనన్ కనిపించనుంది. ‘ది ఐరన్ లేడీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పెన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా అనుకోని వివాదంలో చిక్కుకుంది. జయలలిత జీవిత కథ అంటే ఆమె సినిమా జీవితంగా కూడా తప్పనిసరిగా చూపించాలి. జయలలిత సినీ జీవితం అంటే హీరో శోభన్ బాబు గురించి తప్పకుండా ఉండాలి. జయలలిత , శోభన్ బాబు ప్రేమించుకున్నారని,చాలా కథలు వచ్చాయి. ఇది నిజమే అంటారు చాలామంది. అప్పటికే శోభన్ బాబుకు పెళ్లై పిల్లలు ఉండటంతోనే వీరిద్దరు పెళ్లి చేసుకోలేదని అంటారు. అయినప్పటికి వీరిద్దరు ఒకరుపై మరోకరు అభిమానంతో ఉండేవారని తెలుస్తుంది.
ఇక జయలలిత సీఎం అయిన తరువాత కూడా వీరిద్దరి మధ్య బంధం అలాగే కొనసాగిందని చెబుతుంటారు. మరి అలాంటి వ్యక్తి జీవిత కథలో శోభన్ బాబు గురించి లేక పోతే ఆ సినిమా సంపూర్ణం కాదని అంటున్నారు సినీ అభిమానులు. ఒకవేళ ప్రస్తావిస్తే జయలలిత అభిమానులు మనోభావాలు దెబ్బతింటాయని కూడా చిత్ర యూనిట్ భావిస్తోంది. శోభన్ బాబు పాత్రను కేవలం గెస్ట్ రోల్ గానే చూపించి ముగించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే సినిమాలో అసలు శోభన్ బాబు గురించి ఏం ఉండదని సమాచారం. పూర్తిగా జయలలిత రాజకీయ అంశాలనే చూపిస్తారట.ఈ బయోపిక్ ఫిబ్రవరి 24వ తేదీన జయలలిత జయంతి సందర్భంగా లాంచ్ కానుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ బయోపిక్ని నిర్మిస్తున్నారు.