దక్షిణ భారత నటీనటుల (నడిగర్) సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ అభిమానులు, ప్రేక్షకులకు మంచి వార్త అందించాడు. తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తాను సంఘం తరఫున చేపడుతున్న నడిగర్ సంఘం భవనం డిసెంబర్లోపు పూర్తవుతుందని విశాల్ ప్రకటించాడు. ఆ తర్వాత ఆ భవనంలో తొలి వివాహ వేడుక తనదేనని తెలిపాడు. చెన్నై విమానాశ్రయంలో విశాల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం భవన నిర్మాణం, తన పెళ్లి విషయాలు, మార్చి 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ విషయాలు పంచుకున్నాడు.
నడిగర్ సంఘం భవనం డిసెంబర్ వరకు పూర్తవుతుందని జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. పనిలో పనిగా ఆ భవనంలోని కల్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని ఆసక్తికరమైన విషయం తెలిపారు. ఈ మేరకు అడ్వాన్స్ ఇచ్చి మండపాన్ని బుక్ చేసుకున్నానని ప్రకటించాడు. అయితే పెళ్లి కుమార్తె ఎవరు అనేది చెప్పలేదు. అయితే శరత్కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ ప్రేమలో ఉన్నాడంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న క్యూబ్, జీఎస్టీ వంటి సమస్యలపై పోరాడుతామని, మార్చి 1వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఆరోజు నుంచి సినిమాల విడుదల ఉండదని చెప్పాడు.