టికెట్ లేని ప్రయాణం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ విషాద సంఘటన గొల్లగూడ రైల్వేస్టేషన్ సమీపంలో విషాదం చోటు చేసుకొంది. రైలులో టీసీని చూసి అతడిని తప్పించుకోబోయి రైలు నుంచి కిందికి దూడానికి ప్రయత్నించగా టీసీకాలర్ పట్టుకోవడంతో అదుపుతప్పి యువకుడు రైలు పట్టాలపై పడిపోయాడు. అతనిపై నుంచి రైలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు నుంచి నాంపల్లి వరకూ రోజూ ప్యాసింజర్ రైలు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు ఈ రోజు టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కాడు. తనిఖీలకు వచ్చిన టీటీఈని గమనించిన యువకుడు రైలు దిగేందుకు యత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన టీసీ .. అతని చొక్కా కాలర్ ను పట్టుకున్నాడు. ఇంతలో రైలు కదలడంతో అదుపుతప్పిన ఆ యువకుడు రైలు, పట్టాల మధ్యలో పడిపోయాడు. వెంటనే అతని పైనుంచి రైలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై కోపోద్రేకులు అయిన ప్రయాణీకులు టీటీఈని చితకబాదారు. ఇతనికి మద్దతుగా అక్కడికి వచ్చిన మరో ముగ్గురు టీటీఈలను కూడా కొట్టారు. మృతుడు వికారాబాద్ పరిధిలోని అనంతగిరిపల్లి తండాకు చెందిన కాట్రావత్ శివగా పోలీసులు గుర్తించారు.