ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతూ మరొకరు ప్రాణత్యాగం చేశారు. చిత్తూరుకు చెందిన యువకుడు సుధాకర్(26) ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. మదనపల్లెలోని రామారావు కాలనీకి చెందిన రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్ చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూసి కలత చెందిన సుధాకర్ శనివారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
హోదా కోసం బలిదానం చేసుకోవడం చిత్తూరు జిల్లాలో ఇది రెండో సంఘటన కాగా.. గతంలో నుకోటి అనే వ్యక్తి తిరుపతిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక సుధాకర్ ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన చేనేత కార్మికుల సమావేశంలో కూడా సుధాకర్ తనగళాన్ని వినిపించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
సేవా గుణం కలిగిన సుధాకర్ అతను నివాసం ఉంటున్న కాలనీ సమీపంలోని ఓ అనాథశ్రమానికి ఇటీవలె రూ. 5 వేల రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిరుపేద అయినప్పటికి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని స్థానికులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడి మరణంతో సుధాకర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.