వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ ధీమాతో ఉన్నారు. అన్ని సర్వేలు కూడా వైసీపీదే విజయం అని తేల్చిచెప్పాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు జగన్ కేబినెట్లో బెర్త్లు ఖాయమయ్యాయనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతుండగా….తాజాగా మరో వార్త ప్రకంపనలు రేపుతోంది.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే వైఎస్ జగన్కు పరిపాలన పరంగా అనుభవం లేదనే చెప్పాలి. అందునా చంద్రబాబును ధీటుగా ఎదుర్కోవాలంటె పరిపాలన అనుభవం ఉన్న నాయకులు కావాలి. జగన్ సీఎం అయిన వెంటనె మీజీ సీఎస్కు కీలక పదవి అప్పగించబోతున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించకపోవడంతో… అధికార యంత్రాంగం ఏ రకంగా పని చేస్తుందనే అంశంపై ఆయనకు పూర్తిస్థాయిలో అవగాహన లేదని చెప్పొచ్చు.పరిపాలనపై పూర్తిస్థాయిలో పట్టు సంపాదించేందుకు పలువురు సీనియర్ నేతలు, అధికారుల సలహాలు తీసుకోవాలని భావిస్తున్న వైసీపీ అధినేత… ఇందుకోసం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన అజయ్ కల్లాంకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది.
అజయ్ కల్లాంకు పరిపాలనలో విస్తృతమైన అనుభవం ఉండడమే కాకుండా క్లీన్ ఇమేజ్ కూడా ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ కల్లాం రెవెన్యూ, ఫైనాన్స్ వంటి కీలకమైన శాఖల్లో పనిచేశారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కల్లాం అమరావతి నిర్మాణం, సింగపూర్ ఒప్పందం వంటివాటిని విమర్శనాత్మక దృష్టితో చూశారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం సహా అనే అంశాల్లో అవినీతి జరిగిందని అజయ్ కల్లాం తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. దీంతో జగన్ ప్రభుత్వానికి అజయ్ కల్లాం సలహాదారుగా ఉంటే… చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని కూడా ఆయన బయటపెట్టే అవకాశం ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వస్తామనె ధీమాతో ఉన్న జగన్ తన పరిపాలన ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.