వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అసెంబ్లీ సమావేశాల్లో తన రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై చర్చ జరగకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. అన్నా రాంబాబు కు మంత్రి అనిల్ కుమార్ కూడ మద్దతుగా నిలిచారు. ఈ విషయమై చర్చ జరగాలని ఆయన కూడ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నైతిక విలువలకు పాతరేసిందని ఆయన ఆరోపించారు. దీనిపై చర్చ కోసం తాను స్పీకర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చానని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు.
గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిన విపక్ష నాయకుడు సభలో నీతులు చెబుతుంటే వినడానికి తాము ఏ మాత్రం సిద్ధంగా లేమని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. దీనిపై ఈ సమావేశాల్లోనే చర్చ చేపట్టాలని ఆయన స్పీకర్ను కోరారు.దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం… ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని అన్నారు. సభా నాయకుడితో చర్చించిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.