ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పవన్ పార్టీలో పలు మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. కనీసం పార్టీ అధ్యక్షుడు కూడా గెలవకపోవడం పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తన సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబుకు కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఎన్నికల ముగిసిన తరువాత పార్టీ పరిస్థితి, ఓటమికి గల కారణాలపై సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాణ్… పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. దీనిలో భాగంగానె పార్టీలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి.. దాని సారథ్య బాధ్యతలను ఆయనకు కట్టబెట్టాలని నిర్ణయించారు. కీలకమైన ఈ కమిటీ సారథ్య బాధ్యతలను నాగబాబుకు అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వచ్చారని జనసేన వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
పవన్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నేత పార్టీలో లేకపోవడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అమెరికాలో జరిగే తానా సభలకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్… ఈ పర్యటనకు ముందే సమన్వయ కమిటీ బాధ్యతలను నాగబాబుకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తరపున నరసాపురం లోక్ సభ స్థానానికి పోటీ చేసిన నాగబాబు… వైసీపీ చేతిలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే.
శ్రేణులకు, నాయకులకు మధ్య సమన్వయం లేదని పవన్ గుర్తించారు. మరోవైపు.. పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తాను కేడర్తో కలిసేందుకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని.. తనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా క్షేత్రస్థాయి నాయకులను కలిసేందుకు వీలు కుదరడం లేదని ఆయన గ్రహించారు. తనకు, కేడర్కు మధ్య సమన్వయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని ఇదివరకే ప్రకటించారు.