ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్ది సేపటి క్రితం స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప సభాపతి ఎన్నికను ప్రస్తావిస్తూ, కేవలం ఒకే ఒక్క నామినేషన్ దాఖలైందని, దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నానని తెలిపారు.
కోన రఘుపతిని సీఎం వైఎస్ జగన్, విపక్షనేత చంద్రబాబు తదితరులు స్పీకర్ స్థానం వద్దకు తీసుకువెళ్లారు. తొలుత జగన్ కోన రఘుపతి స్థానం వద్దకు వచ్చి, ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, ఆపై చంద్రబాబు సైతం రఘుపతిని కౌగిలించుకుని అభినందించి, స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.
ఇదలా ఉంటె స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. ఆయన్ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టే సమయంలో.. చంద్రబాబు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తనకు బదులుగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిని పంపించారు. దీంతో బాబుపై అన్ని వర్గాలనుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకున్నారు.
డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో మళ్లీ వివాదం ఉండకూడదని భావించిన చంద్రబాబు.. కోన రఘుపతిని స్పీకర్ చైర్లో కూర్చోబెట్టేందుకు జగన్తో కలిసి వెళ్లారు. స్పీకర్ ఎన్నిక సమయంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా బాబు ముందుచూపుతో వ్వహరించారు.