అన్ని అర్హతలున్నా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి మాత్రం పార్టీలో సముచిత స్థానం దక్కలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనె రోజాకు మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. కాని తీరా చివరకు రోజాకు మంత్రి పదవి విషయంలో నిరాశె ఎదురయ్యింది. ఆమెకు అన్యాయం జరిగిందని మీడియా కోడై కూయగా నామినేటెడ్ కోటాలో APIIC ఛైర్మన్ పదవి దక్కింది. ఆ పదవిలో కొనసాగుతున్న రోజా… అదే సమయంలో… నగరి ఎమ్మెల్యేగా అక్కడి ప్రజల సమస్యలపైనా ఫోకస్ పెడుతున్నారు.
ఇదలా ఉంటె జగన్ రోజాకు మరో ముఖ్యమైన పదవిని ఇవ్వనున్నారనె వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ ఇష్టమైన పథకాలు నవరత్నాలు. అదే నవరత్నాలు జగన్ను సీఎంగా చేసింది. అదే సమయంలో పథకాల అమలు సక్రమంగా లేకపోయినా, అవినీతి జరిగినా, లబ్దిదారులకు ప్రయోజనం కలగకపోయినా… అది జగన్ పాలన, వైసీపీ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందువల్ల పథకాల అమలు బాధ్యతల్ని రోజాకు అప్పగిస్తారని తెలుస్తోంది.
నవరత్నాల పథకాల అమలును రోజాకు అప్పగిస్తే ..ఆమె పర్యవేక్షణలో పథకాల అమలు జరిగేలా చెయ్యాలని జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. ముక్కుసూటిగా మాట్లాడుతూ, ఫైర్ బ్రాండ్లా వ్యవహరించే రోజా అయితే… పనులు పక్కాగా జరిగి, సరైన ఫలితాలు వస్తాయని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజంగా నవరత్నాల అమలు బాధ్యతను రోజాకు అప్పగిస్తే… ప్రభుత్వంలో జగన్ తర్వాత అత్యంత బిజీగా మారే నేత రోజా అయ్యే అవకాశం ఉంటుంది. 2021లో జరిగే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకోవడం కష్టమవుతుందనే వాదన వినిపిస్తోంది. మంత్రి పదవి కంటే నవరత్నాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే జగన్… ఆమెను అవే బాధ్యతలు నిర్వహించమని కోరే అవకాశాలున్నాయి. మంత్రి పదవి రాకపోయినా రోజాకు జగన్ సరైన ప్రాధాన్యత ఇచ్చారు.