సినిమా అవకాశాలు రావాలంటే అంతాఇంతా కాదు. అదే ఫ్లాపులో ఉన్న హీరోకైతే అసలుకే అవకాశాలు దొరకవు. అవకాశాలు వచ్చిన నిర్మాతలు ముందుకు రారు. అలాంటి సమయంలో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసిన తర్వాత కూడా నిర్మాతలు హ్యాండిస్తే మాత్రం ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోతాయి. అలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయి. ఈ సమయంలో హీరోలందరూ తామే నిర్మాతలుగా మారుతున్నారు. ఒకర్ని అడుక్కోవాల్సిన పరిస్థితి లేదని భావిస్తూ వాళ్లే దుకాణం పెడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు యువ నటుడు నాగశౌర్య కూడా ఓ దుకాణం పెట్టేశాడు.
తన తల్లి ఉష మల్పూరితో కలిసి ఐరా క్రియేషన్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ బ్యానర్లో తొలి సినిమా నాగశౌర్యతో ‘ఛలో’ చేశారు. ఆ సినిమా ఆడకపోయినా నష్టం తామే భరిస్తామని చాలా ఏరియాల హక్కులను తమ వద్దే ఉంచుకొని ‘ఛలో’ సినిమా విడుదల చేశారు. అయితే ఆ సినిమా సూపర్హిట్గా నిలవడంతో లాభాల పంట పండింది. తొలి సినిమాతోనే మంచి లాభాలు రావడంతో ఇక తన తర్వాతి సినిమాలన్నీ తమ బ్యానర్లో తీయాలని నాగశౌర్య ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ఇటీవల రెండు, మూడు సినిమాలను నాగశౌర్య అంగీకరించాడు. ఆ ఒప్పుకున్న సినిమాలు తమ బ్యానర్లో చేయాలని నాగశౌర్య కండీషన్ పెట్టాడని సమాచారం.
ప్రస్తుతం ఆయన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో ప్రారంభించిన సినిమా ‘నర్తనశాల’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్. డ్యాన్స్ నేపథ్యంలో ఈ సినిమా వినోదభరితంగా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ‘ఛలో’ సినిమాకు సంగీత దర్శకుడు సాగర్ ఈ సినిమాకు పని చేస్తున్నాడు. ఆ తర్వాత నాగశౌర్య కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో చేసే సినిమాను కూడా సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్లోనే చేయాలని భావిస్తున్నాడు. నష్టమో.. లాభమో మనమే చేద్దామనే ఆలోచనలో యువ నటుడు ఉన్నాడు.