వర్షాలు రాకుంటె కప్పలకు పెళ్లిల్లు చేసి ఊరేగించడం ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా వస్తోంది. ఒక వేళ కుండపోత వర్షాలు కురుస్తుంటే.. వరదలతో బీభత్సం సృష్టిస్తుంటే అప్పుడేం చేయాలి అన్న సందేహం అందరిలోను ఉంటుంది. అది తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు మధ్యప్రదేశ్ వెల్లాల్సిందే.
ప్రస్తుతం భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ అల్లాడుతోంది. అయితే వర్షాకాలం ప్రారంభంలో రాష్ట్రంలో పరిస్థితి ఇలా లేదు. ముఖ్యంగా రాజధాని భోపాల్లో తీవ్ర నీటి ఎద్దడి. తాగడానికి కూడా నీరు దొరకని స్థితి. దాంతో భోపాల్ పట్టణ ప్రజలు వరుణుడి అనుగ్రహం కోసం కప్పలకు పెళ్లి చేశారు. ప్రస్తుతం అక్కడ వర్షాలు సాధారణంకంటె 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ కుండపోత వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా జీవితం వరదలకు అస్తవ్యస్తమైంది. దీంతో వర్షాలు ఆగిపోవాలన్న ఉద్దేశంతో శివ్ సేవా శక్తి మండల్ సభ్యులు ఆ కప్పలను తెచ్చి, వేదమంత్రాలు చదువుతూ విడాకులు ఇప్పించారు.
వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. కుండపోత వర్షాలను ఆపేందుకు ఇంద్రపూరి ప్రాంతానికి చెందిన శివ్ సేవా శక్తి మండల్ సభ్యులు గతంలో తాము పెళ్లి చేసిన కప్పలను విడదీశారు. వేదమంత్రాల సాక్షిగా, వైభవంగా ఈ వేడుక నిర్వహించడం గమనార్హం.