అగ్రరాజ్యం అమెరికా , చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని కంప్యూటర్ నెట్వర్క్కు విదేశీ శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నిఘావర్గాల హెచ్చరిక నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు.
దీని ఫలితంగా అమెరికా కంపెనీలు విదేశీ టెలికాం సేవలను వినియోగించడానికి బ్రేక్ పడింది. అలాగే విదేశీ కంపెనీలు కూడా అమెరికా కంపెనీల నుంచి నెట్వర్క్ పరికరాలను కొనాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి కచ్చితంగా ఉండాలి.చైనాకు చెందిన ప్రపంచపు అతిపెద్ద టెలికం కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ కంపెనీ హువావే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా హువావే కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి మధ్య విబేధాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.
ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హువావే స్పందించింది. తామను వ్యాపారం చేయకుండా అడ్డుకుంటే అమెరికా వినియోగదారులు, కంపెనీలే ఇబ్బంది పడతాయని స్పష్టంచేసింది. అమెరికా ఆంక్షలు అర్థంలేనివని, తాము ఏ దేశం కోసం పనిచేయడం లేదని స్పష్టం చేసింది. ట్రంప్ తాజా నిర్ణయాలతో రెండుదేశాల మధ్య మరింత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకొనే అవకావం ఉంది.