సీఏఏ నిరసన కార్యక్రమంలో.. “పాకిస్తాన్ జిందాబాద్” అని నినాదాలు చేసింది అమూల్య అనే యువతి. దాంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమెను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. గురువారం బెంగళూరు ఫ్రీడంపార్క్లో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ ర్యాలీకి అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. అయితే అమూల్య లియోన్ అనే యువతి వేదికపై పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారంత షాక్ అయ్యి ఆమె నుంచి మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికి అమూల్య నినాదాలు కొనసాగించింది. ఈ విషయంపై కర్ణాటక సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. అమూల్యకు బెయిలు ఇవ్వదని.. ఆమె తండ్రి కూడా తనను రక్షించేందుకు సిద్దంగా లేనని చెప్పారన్నారు. ఆయన మాటల ద్వారా అమూల్యకు నక్సల్స్ తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. ఆమెకు తప్పకుండా తగిన శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.
ఇక అమూల్య వ్యాఖ్యలకు నిరసనగా.. శ్రీరామ్ సేన, హిందూ జాగృతి సమితిసభ్యులు ఆందోళన చేపట్టారు. అమూల్య క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక అమూల్య ఇంటిపై కొంతమంది రాళ్లతో దాడి కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక అమూల్య వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇక ఈ కార్యక్రమానికి అమూల్యను ఎవరు ఆహ్వానించారు. పాకిస్తాన్ అనుకూలంగా నినాదాల వెనుక కారణాలు ఏంటి ? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.