తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.సీఎంతోపాటు హోం మంత్రి సుచరిత, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన సీఎం.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడనుంచి ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని, అక్కడ జరుగుతున్న గాలింపు చర్యలను ఏరియల్ సర్వే ద్వారా సీఎం పరిశీలించారు.
అనంతరం రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను జగన్ పరామర్శించారు. క్షతగాత్రుల వద్దకు స్వయంగా వెళ్లి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, తదితరులు ఉన్నారు.ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ సర్కారు ఇప్పటికే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.