రాష్ట్రంలో అక్రమ కట్టడాలు, అవినీతిపై జగన్ ఉక్కుపాదం మోపనున్నారు. ఇవాల ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మనం కూర్చుకున్న ప్రజావేదికే ఒక అక్రమ కట్టడం. ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన అక్రమం. అలాంటి అక్రమ కట్టడం ద్వారా నాటి ముఖ్యమంత్రి కింది స్థాయి వారికి ఏం సందేశం ఇచ్చినట్టు? నాటి అక్రమాలను గుర్తు చేయడానికే కలెక్టర్ల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జగన్.
ఒకవైపు ‘ప్రజావేదిక’ను తమకు అప్పగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ విషయంలో జగన్ కు చంద్రబాబు నుంచి విన్నపం కూడా వెళ్లింది. అయితే జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా అక్రమ కట్టడాలపై ఒక మేసేజ్ ఇచ్చినట్లు అర్థ మవుతోంది.
ఈ భవన నిర్మాణాన్ని రూ.5 కోట్ల నుండి రూ. 8 కోట్లకు పెంచారని జగన్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనంలో ఇంత మంది అధికారులం సమావేశమైనట్టుగా ఆయన చెప్పారు. ఇలాంటి భవనాన్ని అధికార అండదండలు ఉన్నందున ఎవరూ కూడ ఏమనలేదన్నారు . ఈ భవనంలో ఇదే చివరి కలెక్టర్ల సదస్సు అని జగన్ తెలిపారు. పర్యావరణ, నదుల చట్టాలతో పాటు అన్ని రకాల నియమ నిబంధనలకు విరుద్దంగా నిర్మించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు గురువారం నుండి ప్రారంభించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
నియమ నిబంధనలను పాటించని వారు ప్రజలు కూడ ఆదర్శంగా ఉండాలని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని అడిగేందుకే తాను ఈ సమావేశమందిరంలో మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా జగన్ చెప్పారు.ప్రతి జిల్లాలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అక్రమ కట్టడం ఏదైనా కూల్చివేతే అనే నిర్ణయంతో చంద్రబాబు నాయుడు ఎంతో ముచ్చటపడి కట్టించిన ఈ నిర్మాణాన్ని కూల్చి వేయాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నిర్మాణానికి వినియోగించింది ప్రజాధనమే.