ఎంకిపెల్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదే.. రాజకీయాలు వదిలేసి తన మానాన తను సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి ఇప్పుడు అమరావతి సెగ తగులుతోంది. ఆయన అధికారికంగా అమరావతి సమస్యపై స్పందించకున్నా.. జగన్ తో సాన్నిహిత్యం నెరుపుతున్న దృష్ట్యా అమరావతి రైతులు ఆయనను కార్నర్ చేసేశారు.
మూడు రాజధానులు, అమరావతిపై చిరంజీవి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ చిరంజీవి ఇంటి ఎదుట ఈరోజు దీక్షకు ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే శనివారం అమరావతి రైతులు చిరంజీవి ఇంటి ముట్టడిని ప్లాన్ చేశారు. చిరంజీవి ఇంటి ఎదుట ధర్నా చేస్తామని.. వెంటనే అమరావతి ఆందోళనకు మద్దతు తెలిపాలని అమరావతి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.
ఆంధ్రా లొల్లి తెలంగాణకు పాకడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నివాసం దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
కాగా ఈ ధర్నాతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమరావతి పరిరక్షణ జేఏసీ తెలుపడం గమనార్హం.