ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలపై మరో అడుగు ముందుకేశారు. అన్ని పెండింగ్ అంశాలను సానుకూలంగా పరిస్కరించుకోడానికి కేసీఆర్, జగన్ ఇతర ఉన్నతాధికారులు తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ హైదరాబాద్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. సీఎంలతో పాటూ ఏపీ నుంచి ఆరుగురు మంత్రులు.. తెలంగాణ నుంచి నలుగురు మంత్రులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటూ వివిధ ప్రభుత్వ శాఖాధిపతులు కూడా సమావేశానికి హాజరయ్యారు.
రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాల సంపూర్ణ వినియోగం, విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం చెల్లించుకోవాల్సిన బిల్లుల బకాయిలు, రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్డ్–9, 10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన తదితర అపరిష్కృత అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. ఇద్దరు సీఎంల సమావేశం శనివారం కూడా కొనసాగనుంది. రెండు రోజుల పాటూ ఈ అంశాలపై చర్చించి.. పరస్పరం ఓ అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది
గోదావరి నుండి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకొనే ఉద్దేశ్యంతో రెండు రాష్ట్రాల సంయుక్తంగా ఉమ్మడి ప్రాజెక్టును నిర్మించాలని సీఎంలు భావిస్తున్నారు. ఎక్కడి నుండి ప్రాజెక్టును నిర్మించే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.