రాష్ట్రంలోని ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ఏలూరులో ప్రారంభించారు. కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియం ఇందుకు వేదికైంది. ఈ పథకం ద్వారా సొంతంగా ఆటో, క్యాబ్ కలిగి వున్న ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేయనుంది. అమౌంట్ మొత్తం వారి ఖాతాల్లో జమకానుంది.
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తామని గతంలో ఏలూరులో ఉన్నప్పుడే హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు అదే నగరంలో వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించడం విశేషం.ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,75,531 మందికి లబ్ధి చేకూరుతుంది. విశాఖ, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వాహన మిత్ర పథకం కోసం అత్యధిక నామినేషన్లు వచ్చాయి.
ఉదయమే ఏలూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ తొలుత ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ‘వైఎస్సార్ వాహన మిత్ర’ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధి పొందే వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కలెక్టర్ ముత్యాల రాజు, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు