జగన్ కేబినేట్లో బెర్త్ దక్కక పోవడంపై అసంతృప్తిగా ఉన్న ఫైర్ బ్రాండ్ రోజాను అదృష్టం వరించింది. మొదట కేబినేట్లో స్థానం దక్కుతుందని అందరూ భావించారు. కాని రాజకీయ సమీకరణాల వల్ల అద సాధ్యపడలేదు. దీంతో గత కొద్ది రోజులుగా రోజా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
దీంతోమంగళవారం సీఎం జగన్ ఆదేశాల మేరకు అమరావతి వచ్చిన రోజా… ఆయనతో చర్చలు జరిపారు. మంత్రి పదవి దక్కని రోజాను బుజ్జగించిన సీఎం జగన్, వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి… ఆమెకు ప్రోటోకాల్ ఉన్న పదవి ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
దానిలో భాగంగానె రోజాకు జగన్ నుంచి తీపి కబురు అందింది. ఆమెకు కీలకమైన పదవిని అప్పగించారు. ఏపీఐసీసీ ఛైర్ పర్సన్ గా రోజాను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.తనకు జగన్ ఏ పదవి ఇస్తారో తెలియదని ఇటీవల రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏ పదవి ఇచ్చినా తగిన న్యాయం చేస్తానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లలో కీలకమైన ఏపీఐసీసీ ఛైర్ పర్సన్ పదవి ఆమెను వరించింది. దీంతో రోజాకు కొంత ఊరట లభించినట్లయ్యింది.
మంత్రి పదవి దక్కలేని అలక వహించిన రోజాతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా జగన్ నామినేటెడ్ పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పార్టీ కోసం కష్టపడిన వారికి జగన్ తగిన విధంగా న్యాయం చేస్తారని రోజావిషయంలో స్పష్టమైంది.