తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.సీఎం హోదా వైఎస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తలపై స్వామివారి శేషవస్త్రంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు.
వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ జగన్ స్వామివారి పట్టువస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. ధ్వజస్తంభానికి నమస్కరించి ముందుకు కదిలారు. వేదపండితులు ఆయన నుంచి వస్త్రాలు స్వీకరించారు.అనంతరం సీఎం జగన్కు ఆశీర్వచనాలు ఇచ్చి.. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ పెద్ద శేషవాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు.