డేటా చోరీ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన కేసు మూలాలు తెలంగాణాలో ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేసి కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై దూకుడు పెంచిన టీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఇదలా ఉండగా ఈ డేటా చోరీ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. సిట్ దర్యాప్తు చేయనుండటంతో టీడీపీనేతలు రివర్స్ అటాక్ చేశారు.
తాజాగా ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను వైసీపీ నేతలు, తెలంగాణ పోలీసులు కలిసి చోరీ చేశారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. వైసీపీకి లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వంలోని సీనియర్ పోలీస్ అధికారులు టీడీపీకి సంబంధించి సమాచారాన్ని తస్కరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీడీపీ నేతల ఫిర్యాదుతో వైసీపీ, తెలంగాణా పోలీసులపై 120బి, 418, 420,380, 409, 167, 177,182 రెడ్ విత్ 511 సెక్షన్ల కింద కేసు నమోదు చెయ్యాలని ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై దాడులు చేశారని ఆ సమయంలో సిఈవో అశోక్, సిబ్బందిని బెదిరించి బలవంతంగా సమాచారాన్ని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల దాడులకు సంబంధించి సీసీ ఫుటేజ్, ఫోటోలను ఫిర్యాదుతోపాటు ఎస్పీకి అందజేశారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల సమస్యగా మారడంతో ఈకేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది.