ఏపీలో ప్రజలకు సుపరిపాలన అందించాలని సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు వేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పురపాలికలు, నగరపాలికల్లో 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు పురపాలక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రతి నాలుగు వేల మంది జనాభాకూ ఓ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమించేలా విధివిధానాల్ని రూపొందించారు.
దీంతో ఈ నెల 22న వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 వరకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు జరపనున్నారు. అక్టోబరు రెండో తేదీ నుంచి గ్రామ సచివాలయాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలు పనిచేయనున్నాయి. వార్డు సచివాలయం ద్వారా లబ్దిదారులందరికీ నేరుగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వార్డు సచివాలయాలను వార్డు కార్యాలయాల్లోనూ, అంగన్ వాడీ భవనాల్లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు