తాను నిర్వహించే కాలేజ్లో లా చదువుతున్న 23 ఏళ్ల యువతిని సంవత్సరం పాటు రేప్ చేసిన కేసులో బీజేపీ నేత స్వామి చిన్మయానంద(73)ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. లా కాలేజీలో సీటు ఇప్పిస్తానని ఆశపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన చిన్మయానంద.. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాది పాటు లైంగికదాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
యూపీలో పలు ఆశ్రమాలు, విద్యాసంస్ధలు నడుపుతూ రాజకీయ ప్రాబల్యం కలిగిన చిన్మయానంద్పై బాధితురాలు నెలరోజుల కిందటే ఫిర్యాదు చేసినా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.సుప్రీం కోర్టు జోక్యంతో కేసులో కదలిక రాగా, సోమవారం భారీ భద్రత నడుమ బాధితురాలు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాలేజ్ హాస్టల్లో ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసి చిన్మయానంద్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. స్వామి పాడుబుద్ధిని బయటపెట్టేందుకు ఆధారాల కోసం తన కళ్లద్దాల్లో కెమెరా అమర్చి రికార్డు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
చిన్మయానంద్పై పరోక్షంగా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన అనంతరం ఆగస్ట్ 24 నుంచి ఆమె అదృశ్యమయ్యారు. వారం తర్వాత యూపీ పోలీసులు ఆమె ఆచూకీని కనుగొన్నారు. మరోవైపు బాధితురాలి ఆరోపణలను పరిశీలించిన సుప్రీం కోర్టు సిట్ విచారణకు ఆదేశించింది.ఈరోజు ఉదయాన్నే షాజహాన్ పూర్ లోని చిన్మయానంద ఆశ్రమానికి చేరుకున్న సిట్ అధికారులు.. చిన్మయానందను అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.