Friday, April 19, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాల జల వివాదం.. జుట్టు కేంద్రం చేతుల్లోకా?

- Advertisement -

రొట్టె ముక్క కోసం పిల్లి పిల్లి తగువులాడుకుంటే సమస్య తీర్చడానికి వచ్చిన కోతి ఆ రొట్టెముక్కను ఎత్తుకుపోయిన చందంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వివాదాన్ని క్యాష్ చేసుకొని లాభపడాలని కేంద్రంలోని బీజేపీ యోచిస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఎందుకంటే తెలంగాణలో రాజకీయంగా బలపడే అవకాశాలు మెరుగ్గా ఉండడం.. కాంగ్రెస్ కుదేలు అవ్వడంతో కృష్ణ జల వివాదాల్లో తలదూర్చి పేరు సంపాదించి పట్టు సాధించాలని బీజేపీ యోచిస్తోందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి తగాధాలను కేంద్రం ప్రభుత్వం ముఖ్యంగా బిజెపి తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదిలిస్తోందా? హడావుడిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి అపెక్స్ కౌన్సిల్ కోవిడ్ సమయంలో సైతం నిర్వహించేందుకు ఆసక్తి చూపడం వెనుక కారణాలేమిటి? ఆన్లైన్లో ఎక్కడివారు అక్కడే ఉండి ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెసులుబాటు కలిగించినప్పటికీ ఇంత హడావుడిగా సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి పట్టుబట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? తెలంగాణలో బిజెపి పార్టీ వ్యవహరిస్తున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతీ అంశంలో పావులు కదుపుతుండడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

రాయలసీమ ప్రాంతంలో కృష్ణా వరద నీటిని వినియోగించుకునే విధంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 25న నిర్వహించాలనుకున్నప్పటికి జలశక్తి మంత్రి కి కరోనా సోకడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. తొలుత 5వ తేది నిర్వహించాలని ప్రతిపాదించగా తెలంగాణ ముఖ్యమంత్రి కోరిక మేరకు వాయిదా వేశారు. ఉమ్మడి ఏపీ ఆంధ్ర – తెలంగాణగా విడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉంటున్నాయి. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ కనుచూపుమేరలో కూడా ఉనికిని చాటుకోలేకపోతున్నాయి. ఇపుడు తాజాగా బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని పట్టుదలతో ఉంది. మౌఖికంగా కూడా కేంద్ర మంత్రి ఏపి ప్రతినిధులతో మాట్లాడినట్లు తెలిసింది. అదే విధంగా కొత్త పథకం కాదంటూ ఎన్జీటి కమిటి ఇచ్చిన ఆదేశాలను స్క్రూట్ని చేయిస్తూ ఆ ఆదేశాలు రివర్స్ చేయించేందుకు ప్రయత్నిస్తోందట.

ఎందుకు ఇంత పట్టుదలతో బిజెపి వ్యవహరిస్తోంది.
ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లోనూ సాగునీటి రంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందులో భాగంగా కాళేశ్వరం, పోలవరం లాంటి ప్రాజెక్ట్లు గోదావరిపై నిర్మిస్తుండగా కృష్ణా నీటి ఆధారంగా తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయసముద్రం, ఎస్ఎల్బిసి లాంటి ప్రాజెక్ట్లులు నిర్మాణంలో ఉన్నాయి. ఏపిలో హంద్రి-నీవా, గాలేరు-నగరి తదితర ప్రాజెక్ట్లు నిర్మాణం చివరిదశలో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లు పూర్తి చేసినప్పటికీ కృష్ణాలో నీటి సమస్య ఎదురయ్యే పరిస్థితి లేదు. తరచూ వరద నీరు వృథా అవుతోంది. గత ఏడాది 600 టిఎంసీలు వృథా అయ్యింది. ఒకవేళ కృష్ణాలో నీటి సమస్య ఎదురైనప్పటికీ గోదావరి నీటి మళ్లింపు ఆధారంగా అధిగమించడం వీలవుతుంది. ఏపిలోని రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించడానికి వరద, మిగులు, నికర జలాల కేటాయింపు ఉన్నాయి. అందుకు సంబంధించి కొన్ని పథకాలు పూర్తయి మరికొన్ని పథకాలు నిర్మాణంలో ఉన్నప్పటికి కేటాయించిన నీటిని ఏపి వినియోగించుకోలేకపోతోంది. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని వినియోగించాల్సి ఉండగా గత రెండు సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన ఏ ఏడాది కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్ట్ లకు మళ్లించలేకపోయారు.

రాయలసీమ పాత ప్రాజెక్టే
ఈ పరిస్థితుల్లో నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని వృధాను అరికట్టేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపి ప్రభుత్వం చేపట్టింది. ఇది కొత్త పథకం కాదని ఎన్జీటి ఆదేశాల మేరకు ఏర్పడిని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి తేల్చిచెప్పింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు లేనేలేదు. పాత ఆయకట్టుకు అంటే పైన పేర్కొన్న ప్రాజెక్ట్లకు కేటాయించిన నీరు ఎస్ఆర్ఎంసిలోకి వెళ్లేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకోసం సంఘమేశ్వర వద్ద పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి నీటిని ఎస్ఆర్ఎంసిలోకి పోతిరెడ్డిపాడు సమీపంలో విడుదల చేస్తారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ను కొత్త ప్రాజెక్ట్గా పరిగణించాల్సిన అవసరం లేదు. కేటాయించిన నీటిని ఉపయోగించుకునేందుకు మాత్రమే వీవుతుంది.

అయితే వివాదం ఎందుకు తలెత్తింది? ఏపిలోని రాజకీయ పార్టీలు దీనిపై మాట్లాడడం లేదు. తేలుకుట్టిన దొంగల్లా తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. దీనిపై మాట్లాడితే ప్రాంతాల ప్రకారం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ పార్టీలు నోరుమెదపడం లేదు. ఇక ఎల్లో మీడియా కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తోంది. అందువల్ల ఏపిలో దీనిపై చర్చేలేదు. అదే సమయంలో ఏపి ప్రభుత్వం రాజకీయంగా ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచలేకపోతోంది. ఇంతవరకు ముఖ్యమంత్రిగానీ, నీటి పారుదల శాఖ మంత్రిగానీ, లేదా అధికార పార్టీ నేతలుగానీ నోరు విప్పిందేలేదు. ప్రాజెక్ట్ కొత్తది కాదని, కేటాయించిన నీటినే వినియోగించుకుంటున్నామని రెండు రాష్ట్రాల ప్రజలకు అర్థమయ్యేరీతిలో వివరించడానికి ఆసక్తి చూపడం లేదు. దాంతో ఏపి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని తెలంగాణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో అభిప్రాయం బలంగా ఉంది. ఇక్కడ ఏపి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

వివాదామల్లా తెలంగాణకు వచ్చేసరికే. తెలంగాణలోని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపిలు ముఖ్యమంత్రి ఏపి సీఎంతో కుమ్మక్కు కావడం వల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని బలంగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. ఎన్జీటిలో కేసు వేసినప్పటికీ టెండర్ ప్రక్రియ నిర్వహించుకునేందుకు అనుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఇవన్నీ విచారణ జరగాల్సి ఉంది. ఈలోగా ఎన్జీటి ఆదేశాల మేరకు ఏపి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ ప్రక్రియను ముగించింది. ఈ లోగా బిజెపి నాయకులు తెలంగాణలో మాట్లాడుతున్న విధంగానే కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు రాష్ట్రాల్లోనూ బిజెపి నాయకులు అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల అదే ధోరణితో వ్యవహిరస్తోంది. ఏపిలో ఇప్పుడు కాస్తా బిజెపి ధోరణి మారింది. కేంద్ర ప్రభుత్వంతో ఏపికి ఇప్పటికైతే సఖ్యత వాతావరణరమే ఉంది. తెలంగాణలో అందుకు భిన్నంగా ఉంది.

లోక్సభ ఎన్నికల తరువాత టిఆర్ఎస్ తో బిజెపికి సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ప్రతీ చిన్న అంశంపైన బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తుంటే వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి తాఖీదులు పంపుతోంది. రాష్ట్రాల మధ్య ముఖ్యంగా తెలంగాణ, ఏపి మధ్య వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఇంజనీరింగ్ నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు.

రెండు రాష్ట్రాల జుట్టు తమ చేతుల్లో ఇరికించుకోవాలనే విధానం కనిపిస్తోంది. కాళేశ్వరం మూడో టిఎంసీ పనులు, పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రం తో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి డిపిఆర్లు ఇవ్వాలని అప్పటిదాకా పనులు ఆపేయాలని కేంద్రం ఆదేశించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించవద్దని కేంద్రం ఆదేశించింది. ఈ విధంగా మొత్తం వ్యవహరాన్ని తమ కనుసన్నల్లో తిప్పుకోవడం ద్వారా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించి ఈ ప్రాంతంలో బలపడాలనేది బిజెపి వ్యూహమా? అనే అనుమానం ఇంజనీరింగ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ఏపిలో బిజెపి బలపడే సూచనలు కనిపించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే టిఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టి ఈ ప్రాంతానికి మేలుచేస్తున్న విధంగా పార్టీ, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించేందుకు సన్నద్దమవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు ప్రస్తుత పరిణామాలను బట్టి అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రెండు రాష్ట్రాలు నష్టపోయే విధంగా కృష్ణా నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. అటు రాయలసీమ, ఇటు దక్షిణ తెలంగాణ శాశ్వతంగా కరువుబారిన పడతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -