Thursday, April 25, 2024
- Advertisement -

పోలవరానికి నాడే బాబు పంగనామాలు

- Advertisement -

నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగడమే కాకుండా అంతరాష్ట్ర వివాదాంతో సంక్షోభంలో కూరుకునిపోయే పరిస్థితి ఎదురవుతోంది. ప్రాజెక్ట్ నిర్మాణాల్లో మరీ ముఖ్యంగా ఇంత భారీ స్థాయి జలాశయాలను నిర్మించేప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి, కాంట్రాక్టర్ ప్రయోజనాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఇంజనీరింగ్ పద్ధతులు పాటించాలని స్పష్టమైన మార్గదర్శకాలు, పద్ధతులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని విస్మరించి చంద్రబాబు ఐదేళ్ళపాటు సాగించిన నిర్మాణాలు ఇప్పుడు ప్రాజెక్ట్కు గుదిబండగా మారాయి. అదే సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నష్టపోయే ముంపు బాధితులకు పునారావాస సహాయక చర్యలు ఏమాత్రం ప్రారంభించకపోవడం వల్ల తాజాగా అంతర్రాష్ట్ర వివాదం ఎదరయి మళ్లీ సమస్య సుప్రీం కోర్టు గడపకు చేరింది. ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఈ ప్రాజెక్ట్ బాబు ఐదేళ్ళ పాలన కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు మరింత వివాదాల్లోకి నెట్టేసి సమస్య ముదిరి పాకాన పడేలా తయారవుతోంది. అప్పటి వైఫల్యాల కారణంగానే ఇప్పుడు తాజాగా ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో పనులు ఆపివేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగానూ, రాష్ట్ర ప్రయోజనాల పరంగా ప్రాజెక్ట్కు అవరోధాలు ఎదురవుతాయేమోనని ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. బాబు సృష్టించిన సమస్యల ప్రకంపనల నుంచి బయటపడేందుకు అధికారులు మళ్లగుల్లాలు పడుతున్నారు. రాత్రింబవళ్లు నిద్ర లేకుండా న్యాయ వివాదాల నుంచి బయటపడేందుకు కష్టిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ వరద ముంపు తీవ్రంగా ఉంటుందని కనీసం 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని ఎదుర్కొనే విధంగా సహాయ పునరావాస చర్యలు చేపట్టాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల ఒడిశా రాష్ట్రంలోని ప్రాంతాలు ముఖ్యంగా గిరిజనులు నివసించే అటవి ప్రాంతాల ముంపునకు గురవతాయని ఆ రాష్ట్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వెంటనే పనులు నిలిపివేసేందుకు ఆదేశించాలనే ఆ రాష్ట్ర విజ్ఞప్తిని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా సమాధానాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ పని చేయడం ప్రభుత్వాలకు కష్టమేమి కాదు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా గత చంద్రబాబు ప్రభుత్వం నిర్ల్యక్షంగా ప్రాజెక్ట్ పనులును అరకొరగా చేపట్టి చేతులు దులుపుకోవడంతో పాటు పునరావస పునర్నిర్మాణం పనులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ముందు కొత్త చిక్కుల వచ్చిపడే ప్రమాదం లేకపోలేదని ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు.

బాబు నిర్లక్ష్యం వల్ల…
ఓ వైపు పరిస్థితి ఈ విధంగా ఉంటే మరోవైపు ఈ ప్రభుత్వం వచ్చాక పోలవరం పనులు నిలిచిపోయాయంటూ తెలుగుదేశం పార్టీతో పాటు వారికి అండగా ఉండే మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోంది. కోర్టు ఆదేశాల కారణంగా జల విద్యుత్ కేంద్రం పనులు అప్పగించకపోయినప్పటికీ జలాశయంలోని ప్రధానమైన పనులన్నీ చురుగ్గానే జరుగుతున్నాయి. అయితే ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలకు బలం చేకూర్చే విధంగా పునరావాస పునర్నిర్మాణ (ఆర్ఆర్) పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇవే ఇప్పుడు సమస్యగా పరిణమించాయి. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 51,424 కోట్లు అవుతందని భావిస్తుండగా అందులో భూసేకరణ, ఆర్ఆర్ పనులకు 32,509 కోట్లు వ్యయం చేయాలి. పోలవరంలో నిర్మాణ పనులకన్నా వాటికే ఎక్కువ వ్యయం చేయాలి. 2013లో అములోకి వచ్చిన ఆర్ఆర్ చట్టం పటిష్టమైనది. ఇందులో ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నష్టపోయేవారికి, ముంపు బాధితులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన అనుమతులన్నీ అప్పట్లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వమే సాధించింది. మొత్తం 13 అనుమతులకుగాను 11 అనుమతులు ఆయన హయాంలోనే లభించాయి. అందులో భూసేకరణ, ఆర్ఆర్ ప్రణాళికకు సంబంధించిన గిరిజన మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, ప్రణాళిక సంఘం నుంచి నాడు వైయస్ అనుమతులు సాధించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్కుమార్రెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణానికి టెండర్ పిలవగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పనులు చేయాలేని స్థితిలో ఉన్న అదే కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. తద్వారా తమ వారికి ఉప పనులు ఇప్పించుకున్నారు.

అప్పటి నుంచి ప్రాజెక్ట్కు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు భూసేకరణ, ఆర్ఆర్ ప్రణాళిక సమాంతరంగా అమలు చేయాలి. కానీ ఆయన కాలంలో నిర్మాణ పనులు ఇంజనీరింగ్ నియమనిబంధనలకు విరుద్ధంగా నామమాత్రంగా జరిగాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రధానంగా స్పిల్వే పనులు చేపట్టాల్సి ఉండగా దానిని పూర్తిగా విస్మరించి కాఫర్ డ్యాం చేపట్టారు. దీనివల్ల అసలు పనులు నిలిచిపోయాయి. అదే సమయంలో వరదలు సంభవించినప్పుడు భారీగా నీరు స్పిల్వే నుంచి పోవడం వల్ల ముంపు తీవ్ర స్థాయికి చేరింది. గత ఏడాది వర్షాకాలంలో గోదావరికి భారీ వరదలు సంభవించాయి. అప్పుడు పనులు నిలిచిపోవడమే కాకుండా భారీ స్థాయిలో ముంపు సమస్య ఎగువ భాగంలో తలెత్తింది. దీనివల్ల జనవరి వరకూ కూడా ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన వర్క్స్ స్పేస్ లేకుండా పోయింది. అదే సమయంలో నిర్మాణ పనులకు అవసరమైన మౌళిక వసతులు ముఖ్యంగా రహదారులు వంటివి కొట్టుకుపోయాయి. వాటిని మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. అదే సమయంలో అప్పటి ప్రభుత్వం, ఇంజనీరింగ్ వైఫల్యాను సవరిస్తూ రాజకీయాకు, కాంట్రాక్టర్ ప్రయోజనాకు అతీతంగా ఇంజనీరింగ్ నిబంధనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనును చేపట్టింది. దాంతో ప్రధాన పనున్నీ వచ్చేఏడాది ఏప్రిల్ నాటికి మొత్తం పను జూన్ నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

ఈ సమస్యలకు బాబు కాఫర్ డ్యామే ప్రధాన కారణం

ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపు సమస్య తలెత్తి పనులు ఎక్కువ కాలం నిలిచిపోవడానికి కాఫర్ డ్యామే ప్రధాన కారణం. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని అప్పట్లోనే చంద్రబాబుకు అర్థమయిపోయింది. అందుకే కాఫర్ డ్యాం పేరుతో కపట నాటకం సాగించారు. 50వేల కోట్లకుపైగా వ్యయం చేసి ప్రాజెక్ట్ను పూర్తిచేసేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం మడమతిప్పి చేతులెత్తేయటంతో కాఫర్ డ్యాంను పూర్తిచేసి దానినే పోలవరంగా చిత్రీకరించేందుకు ఆయన వ్యూహం పన్నారు. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజీ తరహాలో కాఫర్ డ్యాం నిర్మాణం విషయంలో అవగాహన వచ్చింది. దీనిని 42.5 మీటర్ల ఎత్తులో నిర్మించాలని బాబు ప్రభుత్వం తెరమీదకు తీసుకురాగా అందుకు ప్రత్యామ్నాయంగా ఎత్తు తగ్గించి నిర్మించే విధంగా డిజైన్లో మార్పులను ఎన్హెచ్పీసీ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) ఆమోదం తెలిపింది. దీనిని అసలు కేంద్రం అంగీకరించకూడదు. మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా నాడు కేంద్రం అంగీకరించింది.

కాఫర్ డ్యామ్ పేరుతో కపట నాటకం…
పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్కు దగా, ద్రోహం చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇంతవరకూ జలాశయా నిర్మాణా చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కాఫర్డ్యాం నిర్మించి దాని ద్వారా పోలవరం మొదటిదశ పూర్తయినట్లు చెప్పుకునేందుకు చంద్రబాబు కుట్రపన్నారు. పోలవరానికి ప్రత్యామ్నాయంగా కాఫర్డ్యాంను కనిపెట్టేసినట్లు గొప్పగా చెప్పుకున్నారు. ఇంకేముంది ఇంజనీర్లంతా ఆయన ముందు వేస్టయిపోయారు. ఇంజనీర్లు విధిలేక దీనిని పోలవరానికి ప్రత్యామ్నాయంగా 42.5 మీటర్లతో తొలి ఒప్పందానికి విరుద్ధంగా రూపొందించారు. ఈ విధంగా కాఫర్డ్యాంను ఎత్తు పెంచి నిర్మించేందుకు అనుమతించాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటానికి కారణం లేకపోలేదు. పోలవరానికి మంగళం పాడేందుకే కాఫర్డ్యాం ఎత్తు పెంచే కుట్ర రంగంలోకి తెచ్చారు చంద్రబాబు.

2018 నాటికి డయాఫ్రం వాల్ నిర్మించి పోలవరం మొదటిదశ పూర్తి చేస్తామని బాబు చెప్పుకొచ్చారు. కానీ అది పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో కాఫర్డ్యాంనే (అంటే జలాశయ నిర్మాణానికి నీరు అడ్డు రాకుండా నిర్మించే మట్టికట్ట) పోలవరం మొదటిదశగా చెప్పుకుని రాజకీయ లబ్ది, కాంట్రాక్టర్ ప్రయోజనాల కోసం అప్పటి నుంచే ‘స్కెచ్’వేసేశారు. కానీ దానిని కూడా చేయలేకపోయారు.

అసలు కాఫర్ డ్యాం అనేది ప్రధాన జలాశయంలో నిర్మాణ పనులు జరిగేటప్పుడు నీరు అడ్డురాకుండా నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణం మాత్రమే. ఇది ఏమాత్రమూ పటిష్టంగానూ, స్థిరంగానూ ఉండదు. శాశ్వతంగా అసలు ఉపయోగపడదు. అటువంటి తాత్కాలిక నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడ నిల్వఉండే నీటిని చూపించి మొదటిదశ పూర్తయిందనిపించుకునేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల అదనపు భారం కావడంతోపాటు కాంట్రాక్టర్కు మాత్రం లబ్ది చేకూరింది.

చంద్రబాబు తప్పులను సుప్రీం ముందుంచుతున్న ఒడిశా…
అప్పట్లో చంద్రబాబు చేసిన ఈ పనివల్ల గత ఏడాది వరదలప్పుడు ఎంత నష్టం జరిగిందో కళ్లారా చూశాం. ఇప్పుడు ఒడిశా ప్రభుత్వం ఆ వరదల విషయాన్ని నమ్మించే విధంగా సుప్రీంకోర్టు ముందుచుతోంది. అదే సమయంలో సహాయ పునరావస చర్యల్లో భాగంగా భూసేకరణ, ఆర్ఆర్ ప్లాన్కు సంబంధించిన అంశాలు లేవనెత్తుతోంది. ఈ ప్రాజెక్ట్కు అయ్యే వ్యయంలో ఇప్పటిదాకా 17 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా అందులో భూసేకరణ, ఆర్ఆర్ పనుల కోసం 5వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులుతో పాటు ఆ పనులు కూడా సమాంతరంగా జరగాలి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం వచ్చే ఏడాది జూన్ నాటికి నీరు అందించే విధంగా పోలవరం పూర్తవుతుంది. కానీ భూసేకరణ, ఆర్ఆర్ పనులు అదే స్థాయిలో జరగడం లేదు. జరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇందుకు నిధుల సమస్య నెలకొంది.

నియమాలకు విరుద్ధంగా… తమవారికి అనుకూలంగా బాబు

కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించినప్పటికీ నిర్మాణ పనులుకు మాత్రమే నిధులు సమకూరుస్తామని ఇతర అంటే భూసేకరణ, ఆర్ఆర్ పనులకు నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. గతంలో చంద్రబాబు ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడిచేసి సాధించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేపట్టలేదు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా పనులను తమ వారికి అప్పగించేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా కాంట్రాక్టర్ మార్పు, తమ వారు సబ్కాంట్రాక్టర్లుగా పనులు చేపట్టడం, స్పిల్వేను విస్మరించి కాఫర్ డ్యాం నిర్మించడం మొదలైనవి ఆయన చేసిన ఘోరమైన తప్పిదాలు.

అప్పట్లోనే భూసేకరణ, ఆర్ఆర్ పనులు కేంద్రం చేపట్టే విధంగా ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. తాజాగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తూ మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అది సాధ్యమైతేనే నిర్మాణ పనులతోపాటు భూసేకరణ, ఆర్ఆర్ పనులు సమాంతరంగా, సులభంగా చేపట్టవచ్చు. లేదంటే ప్రాజెక్ట్ పూర్తవుతుంది కానీ ముంపు బాధితుల గురించి పట్టించుకునేవారు ఉండరు. ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నష్టపోయేవారిని క్షేమంగా ఇతర ప్రాంతాలకు ప్రత్యామ్నాయ వసతులతో నిర్మించకుండా తరళిస్తే ఆర్ఆర్ చట్టం ఒప్పుకోదు. అందువల్ల నీటిని నిల్వ చేయడం వీలుపడదు. అదే సమయంలో ఆర్ఆర్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఆపివేసే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -