పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం సులభతరం కానుంది. కేంద్రం తీసుకొచ్చిన ప్రతీష్టాత్మక పౌరసత్వ సవరణ బిల్లు-2019కు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు వల్ల మతపరమైన మైనారిటీలు- హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు కూడా భారత పౌరసత్వం పొందుతారని చెప్పారు.
అయితే ఈ బిల్లుపై విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నందున దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ డిమాండ్ను స్పీకర్ సుమిత్రా మహాజన్ పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. ఇది విభజించే బిల్లు అని, రాజ్యాంగ మౌలిక లక్షణాలకు వ్యతిరేకమని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ చర్చ సందర్భంగా వాదించారు.
ప్రతిపాదిక చట్టం అసోంకు మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుందని హోమంత్రి రాజ్నాధ్ చెప్పారు. ఈ బిల్లుతో దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా లబ్ధిదారులు నివసించేందుకు వెసులుబాటు ఉంటుందని చెప్పారు.