రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిన సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బాగోతాలపై విచారణ జరపాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి 2019 వరకు జరిగిన అవినీతిపై విచారణ జరిపేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించేందుకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ 30 అంశాలపై విచారణ జరుపుతుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
విద్యుత్ రంగంపై సమీక్ష సమావేశం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై దృష్టి సారించింది. విద్యుత్ ఒప్పందాలు ఖరారు చేసిన అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి, ఉన్నతాధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఒప్పందాల్లో భారీ దోపిడీ జరిగిందని స్పష్టమైందని జగన్ అభిప్రాయపడ్డారు.
సోలావర్, విండ్ పవర్ కొనుగోళ్లపై విస్తృత చర్చ కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్లకన్నా అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని సీఎం ప్రశ్నించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2,636 కోట్లు నష్టం వాటిల్లిందని అభిప్రాయపడ్డారు. ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. కంపెనీలతో కొత్త ఒప్పందాలు కుదర్చుకోవాలని లేకుంటే కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.మొత్తం మీద విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగిన అవినీతి చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.