అటవీ శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అడవుల సంరక్షణ, వన్యప్రాణుల భద్రత, మొక్కల పెంపకంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ప్లాస్టిక్ నిషేధంపై జగన్ ఫోకస్ చేశారు. సింగిల్ ప్లాస్టిక్ విధానాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు హరిత పన్ను విధిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళన చేపడతామని వెల్లడించారు. గోదావరి జిల్లాల్లో పంటకాల్వల పరిరక్షణకు ‘మిషన్ గోదావరి’ చేపడతామని తెలిపారు.