ఆంధ్రప్రదేశ్ లో దోపిడీకి ఆలవాలమైన పటేల్ ,పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాడు ఎన్టీఆర్ ఒక విప్లవాత్మకమైన మండలాల వ్యవస్థకు ప్రాణం పోసి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా ఎవ్వరూ చేయని సాహసాన్ని చేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఎంతో రాద్ధాంతం చేస్తున్నా.. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా 3 రాజధానుల బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి కోసం విప్లవాత్మక నిర్ణయాలను బిల్లులో పొందుపరిచి మరో ఎన్టీఆర్ ను తలపిస్తున్నారు సీఎం వైఎస్ జగన్.
సీఎం జగన్ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జోన్ లు, రీజినల్ డివిజనల్ పద్ధతిని ప్రవేశపెడుతూ సంచలన నిర్ణయానికి నాంది పలుకుతున్నారు. ఇన్నాళ్లు ఏదైనా పని కావాలంటే సచివాలయం, సంబంధిత శాఖ డైరెక్టర్లు, అధిపతుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక నుంచి మండల, డివిజన్, జిల్లా ఆఫీసులు, రీజినల్ డైరెక్టర్ కార్యాలయాన్నీ ఆయా జిల్లాల్లోనే ఏర్పాటు అవుతాయి. తద్వారా రాజధాని వరకూ ఎవ్వరూ వెళ్లకుండా సీఎం జగన్ సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
ఈ రీజినల్ జోనల్ వ్యవస్థ వల్ల నియామకాలు, బదిలీలు, పింఛన్లు అన్నీ ఎక్కడి ప్రాంతంలో అక్కడే అధికారులు ఉండి పరిష్కరిస్తారు. ఏ ప్రాంతం వారు ఆ రీజియన్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లాలి. దీని వల్ల ప్రజలకు ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతుంది.ఇప్పటికే ఇటువంటి పద్ధతి మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో సక్సెస్ అయ్యింది కూడా..
పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రభుత్వానికి కాస్త అదనపు ఖర్చు అయినా కూడా ప్రతీ శాఖకు నాలుగు, ఐదు రీజియన్ కార్యాలయాలు, అధిపతులు ఉండి ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుంది.
తాజాగా సీఎం జగన్ ప్రతిపాదించిన ప్రకారం ఏపీలో రాయలసీమ, విజయవాడ, రాజమండ్రి , విశాఖ కేంద్రాలుగా నాలుగు రీజియన్ జోన్స్ ఉంటాయి. ఉద్యోగులంతా ఇక్కడే ఉంటారు. ప్రజలకు పాలన చేరువ అవుతుంది. మండలాల వ్యవస్థలతో ప్రజలకు పాలనను దగ్గరి చేసిన ఎన్టీఆర్ ను తలపించేలా జగన్ తీసుకున్నా ఈ రీజియన్ పాలన భవిష్యత్తులో గొప్ప సంస్కరణగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.