సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ తొలి విదేశీ పర్యటన త్వరలో ఖరారు కానుంది. సీఎం అయిన తర్వా పరిపాలనలో తన దైన మార్క్తో దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో వైఎస్ జగన్ ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి విదేశీ పర్యటనకు వచ్చే నెలలో వెళ్లనున్నారు. రాబోయే ఆగస్టులో తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ యూఎస్ వెళ్లనున్నారు. ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు వైఎస్ జగన్ ఫ్యామిలీ పర్యటన కొనసాగనుంది.
పర్యటనలో భాగంగా మిషిగన్-డెట్రాయిట్-కోబో కన్వెన్షన్ సెంటర్లో ఎన్నారైలతో ఆయన సమావేశంకానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జగన్ వెళ్తున్న తొలి విదేశీ పర్యటన కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పాటుగా ఎన్నారైల సంక్షేమం కోసం తాము తీసుకునే నిర్ణయాలను వెళ్లడించనున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు కలిసి రావాల్సిన ఆవశ్యకతను ఆయన చాటిచెప్పనున్నారు.
జగన్ ఇటీవలే విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయంలో సీఎం హోదాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పొందారు. ఈ టూర్లో ఎన్నారైలు వివిధ అంశాలపై ఆయనతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నారైల సంక్షేమం పేరుతో జరిగిన కార్యక్రమాల్లో కొందరి నిధుల దుర్వినియోగం, ఉద్దేశపూర్వకంగా కొందరికే ప్రయోజనం చేకూర్చడం వంటి ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.