సర్వేలతో ఎప్పుడూ కుషీకుషీగా ఉండె లగడపాటికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తన సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే మాజీ మంత్రి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మూడు రోజుల ముందు అంటే మే 19న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. మరో సారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తాదని ప్రకటించారు. అయితే ఆయన అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వైసీపీ 151 సీట్లు సాధిస్తే టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే సాధించి ఘోర పరాజయం చెందింది.
తప్పుడు సర్వే చేసి అన్నీ అబద్ధాలు చెప్పారని ప్రజలు దుమ్మెత్తిపోశారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఈ దెబ్బతో ఇకపై తాను ఎన్నికల ఫలితాలపై సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చేయనని లగడపాటి ప్రకటించారు. ప్రజలను క్షమించమని కోరారు.
ఈ నేపథ్యంలో లగడపాటి మీద కేసు నమోదయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన తప్పుడు సర్వేల కారణంగా చాలామంది నష్టపోయారని మురళీకృష్ణ తెలిపారు. ఈ సర్వేను నమ్మి ప్రజలు కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వెనుక అంతర్జాతీయ మాఫియా ఉందన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.