ఓవైపు కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. ప్రజలంతా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్ భయానికి ఎవరూ అడుగు తీసి కాలు బయటపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో మరో కొత్త ఉపద్రవం వచ్చి పడింది. ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ వేళ మూగజీవాలు అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడుతుండడం జనాలను భయాందోళనకు గురిచేస్తోంది.
తాజాగా కరోనా వైరస్ తీవ్రతతో కరీంనగర్ జిల్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక్కడ పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. తాజాగా అదే కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కలు పదుల సంఖ్యలో వరుసగా మరణిస్తుండడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓడెడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో వీధికుక్కలు చనిపోవడం కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి 12 కుక్కలు మరణించడంతో కరోనాతో చనిపోయాయా అన్న ఆందోళన గ్రామస్థులను వెంటాడుతోంది. కుక్కలకు కరోనా సోకిందా? లేక ఏదైనా వింత రోగం వచ్చిందా అని పశువైద్యాధికారులు సమీక్షిస్తున్నారు.
అయితే శానిటైజర్లు, హైపోక్లోరైడ్ ద్రావణం వీధుల్లో చల్లిన తర్వాతే కుక్కలు మరణించడంతో వాటివల్లే ఎఫెక్ట్ అయ్యి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.