చెన్నైలోని చిదంబురం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మొదటి మ్యాచ్లో.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన చెన్నై సూపర్కింగ్స్ ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. సొంత ఇలాఖాలో ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంటూ విజయదుందుభి మోగించింది.హర్భజన్సింగ్, ఇమ్రాన్ తాహిర్, జడేజా స్పిన్ విజృంభణతో 70 పరుగులకే కోహ్లీసేన కుప్పకూలింది. బ్యాటింగ్లో రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ వికెట్లను వరుస ఓవర్లలో పడగొట్టిన హర్భజన్ సింగ్కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9) ధాటికి 17.1 ఓవర్లలో 70 పరుగులకే చేతులెత్తేసింది. స్వల్ప లక్ష్యాన్ని అంబటి రాయుడు (28: 42 బంతుల్లో 2×4, 1×6) సమయోచిత ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై జట్టు మరో 14 బంతులు మిగిలి ఉండగానే 71/3తో ఛేదించేసింది చెన్నై సూపర్ కింగ్స్.
బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ ఏదశలో గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (29: 35 బంతుల్లో 2×4) మినహా ఎవరూ రాణించలేదు.కోహ్లీ (6: 12 బంతుల్లో, మొయిన్ అలీ (9: 8 బంతుల్లో 1×6), ఏబీ డివిలియర్స్ (9: 10 బంతుల్లో) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు.యువ హిట్టర్ హెట్మెయర్ (0) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటవగా.. శివమ్ దూబే (2), గ్రాండ్ హోమ్ (4), నవదీప్ షైనీ (2) ఉమేశ్ యాదవ్ (1) ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు.
స్వల్ప లక్ష్య ఛేదనలోకి దిగిన చెన్నై ఆదిలోనె ఓపెనర్ షేన్ వాట్సన్ (0: 10 బంతుల్లో) వికెట్ కోల్పోయినా సురేష్ రైనా (19: 21 బంతుల్లో 3×4) , అంబటి రాయుడు ఆదుకున్నారు. ఇద్దరూ 32 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం రైనాని ఔట్ చేయడం ద్వారా మొయిన్ అలీ విడదీశాడు.కేదార్ జాదవ్ (13 నాటౌట్: 19 బంతుల్లో 1×4)తో కలిసి నిలకడగా ఆడిన అంబటి రాయుడు.. జట్టు స్కోరు 59 వద్ద ఔటవగా.. ఆఖర్లో జడేజా(6 నాటౌట్: 15 బంతుల్లో)తో కలిసి కేదార్ జాదవ్ గెలుపు లాంఛనాన్ని 17.4 ఓవర్లలో పూర్తి చేశాడు.