టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీల చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. అక్రమంగా నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. నిన్న అర్థరాత్రి సమయంలో ఈ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో అప్రమత్తం చేశారు. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
విచారణకు హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులు జారీ చేసినా ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు.ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని..విచారణకు హాజరుకాలేమని రవిప్రకాశ్, శివాజీ సైబర్ క్రైం పోలీసులకు సమాచారం పంపారు. విచారణకు హాజరయేందుకు మరో 10 రోజులు గడువు కావాలని కోరారు. రవిప్రకాశ్, శివాజీలు పంపిన ఈ-మెయిల్స్ పై సంతృప్తి చెందని పోలీసులు..ఈ మేరకు లుక్ ఔట్ సర్య్కులర్ జారీచేశారు. ఇప్పటికే రవిప్రకాశ్ పాస్ పోర్టును పోలీసులు సీజ్ చేశారు.