మహిళలపై రోజు రోజుకీ వరకట్న వేధింపులు పెరిగిపోతున్నాయి. అదనపు కట్నం తేవాలని కోడళ్లపై అత్తమామలు, భర్త దాడి చేసిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు విశాఖలో చోటు చేసుకుంది.కట్నం కోసం కడుపుతో ఉన్న కోడలికి ఓ అత్త నరకం చూపించింది. అదనపు కట్నం కింద రూ.25 లక్షలు తీసుకుని రావాలని దాడి చేసింది. అంతటితో ఊరుకోకుండా ఆరు నెలల గర్భంతో ఉన్న కోడలి కడుపుపై కాలితో తన్నితన వరకట్న రాక్షసత్వాన్ని నిరూపించుకుంది. వారికి భర్త కూడా తోడవ్వడంతో కోడలిని చిత్రహింసకు గురి చేశారు. వేధింపులు శ్రుతి మించడంతో బాధితురాలు స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెల్తే…..విశాఖ జిల్లాలోని పెందుర్తికి చెందిన దామోదర్ కు, అదే ప్రాంతానికి చెందిన రాజేశ్వరితో ఇటీవల పెళ్లయింది. వివాహ సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు బాగానే కట్నకానుకలు ఇచ్చారు. మొదట బాగానె ఉన్నా కొన్నిరోజుల తర్వాత అత్త లలిత రాజేశ్వరికి నరకం చూపించడం ప్రారంభించింది. రాజేశ్వరి నెలతప్పడంతో అదనపు కట్నం తీసుకురావాలనీ, లేదంటే అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసేది. రాజేశ్వరికి ఇప్పటికే మూడుసార్లు అబార్షన్ చేయించారు. మళ్లీ గర్భం దాల్చిన రాజేశ్వరిని వారిద్దరూ మరింత హింసిస్తున్నారు.
భార్యకు అండగా నిలవాల్సిన దామోదర్ తల్లికి వంతపాడాడు. సైకోగా మారి బ్లేడుతో మణికట్టును పలుమార్లు కోశాడు. తాజాగా మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న దామోదర్ భార్యను పట్టించుకోవడం మానేశాడు.మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన దామోదర్ భార్యతో గొడవపడ్డాడు. బుధవారం ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్తానని భార్యను కారు ఎక్కించాడు. వారితో పాటు దామోదర్ తల్లి కూడా బయలుదేరింది.
మార్గమధ్యంలో కోడలితో గొడవ పెట్టుకున్న అత్త లలిత.. రాజేశ్వరి కడుపుపై తన్నింది. పుట్టింటి నుంచి రూ.25 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలనీ, లేదంటే అబార్షన్ చేయించుకోవాలని మరోసారి స్పష్టం చేసింది. కడుపుపై దాడిచేయడంతో నొప్పితో అల్లాడిపోయిన రాజేశ్వరి గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు కారును ఆపివేశారు. దీంతో స్థానికుల అండతో అక్కడనుంచి తప్పించుకున్న రాజేశ్వరి ఎమ్మార్ పేట పోలీసులను ఆశ్రయించింది. రాజేశ్వరీ వాంగ్మూలం మేరకు అత్త లలిత, భర్త దామోదర్ పై కేసు నమోదుచేశారు.