సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రామ్ ప్రకాశ్ సిసోడియాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదీని నియమించింది. ఇటీవలే ఏపీలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
1993 బ్యాచ్కు చెందిన ద్వివేది ప్రస్తుతం ఏపీ పశుసంవర్దక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ ద్వివేదికి ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ద్వివేది నియమితులైన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడు.
అందరి సహకారంతో ఎన్నికలను నిష్పక్షపాతముగా నిర్వహిస్తామని తెలిపారు. ఓటరు జాబితాలో అవకతవకలు ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు. తప్పులు చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోనని తేల్చిచెప్పారు. త్వరలోనే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో సిసోడియాను ఈసీ బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.