ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంబరం ఆవిరైంది. ఎన్నికల సంఘం తనకు హెలికాప్టర్ గుర్తు కేటాయించడంతో ఉబ్బితబ్బిబ్బయిన పాల్.. ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. ఆయన పార్టీ గుర్తును ఈసీ హోల్డ్లో ఉంచింది. కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీకి ఈసీ ఇటీవల హెలికాప్టర్ గుర్తు కేటాయించింది. హెలికాప్టర్ రెక్కలు అచ్చం… వైసీపీ ఫ్యాన్ రెక్కల తరహాలోనే ఉండడంతో వైఎస్ఆర్సీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. రెండు గుర్తులు ఒకేలా కనిపిస్తుండడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుందని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీ… హెలికాప్టర్ గుర్తును ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచుతున్నట్టు ప్రకటించింది.
ఈసీ ప్రజాశాంతి పార్టీకి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ రెండు గుర్తుల మధ్య తేడాను ఓటర్లు గుర్తించగలరని … కాబట్టి తమకు తొలుత కేటాయించిన గుర్తునే కొనసాగించాలని ఈసీని కోరారు పాల్. అయితే, హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టి మరో గుర్తును కేటాయించేందుకే ఈసీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.