దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. వందలాది మంది వివిధ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో చేరుతున్నారు. వైరస్ సోకిన బాధితులతో పాటు ఆ లక్షణాలతో పరీక్షలు చేయించుకుని ఫలితాల కోసమ్ వేచి చూస్తున్న వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచుతున్నారు. ఇక అందరికంటే ముందే కరోనా బాధితుల కోసం కేరళ ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఆహార అలవాట్లపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యాప్తిస్తుండగా.. ఐసోలేషన్ వార్డులో ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నామో కేరళ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది.
కళామస్సెరీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండు రకాల మెనూ ఏర్పాటు చేశారు. ఒకదాన్ని భారతీయులకు, మరో మెనూను విదేశీయులకు అందిస్తున్నట్టు ఎర్నాకులం జిల్లా కలెక్టర్ ఎస్. సుహాస్ చెప్పారు. భారతీయులకు ఇస్తున్న మెనూలో రోజూ తినే ఆహార పదార్థాలే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్లో దోశ, సాంబార్, రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఆరెంజ్ పండ్లు, టీ అందజేస్తున్నారు. ఆ వెంటనే ఉదయం 10.30 గంటల సమయంలో పండ్ల రసం ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో చపాతీలు, కేరళ మీల్స్ పాటు చేపల ఫ్రై, మినరల్ వాటర్ ఉన్నాయి. ఆపై, మూడు గంటల సమయంలో టీతో పాటు బిస్కెట్లు అందజేస్తున్నారు. ఇక, రాత్రి భోజనంలో అన్నంతో పాటు రెండు అరటి పండ్లు ఇస్తున్నారు.
విదేశీయులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం వాళ్లకు నప్పే ఆహారాన్ని అందిస్తోంది. బ్రేక్ఫాస్ట్లో సూప్, పండ్లు, రెండు గుడ్లు ఉన్నాయి. ఆ తర్వాత పైనాపిల్ జ్యూస్ ఇస్తున్నారు. లంచ్లో టోస్టెడ్ బ్రెడ్, ఛీస్తో పాటు కొన్ని పండ్లు అందజేస్తున్నారు. ఆ తర్వాత టీకి బదులు పండ్ల రసం ఇస్తున్నారు. రాత్రి భోజనంలో టోస్టెడ్ బ్రేడ్, ఎగ్స్ , పండ్లు అందిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరికి వార్తా పత్రికలు కూడా అందుబాటులో ఉంచారు. ఐసోలేషన్ వార్డుల్లో అన్ని సాధారణ సౌకర్యాలు ఉన్నాయని ఎర్నాకులం కలెక్టర్ తెలియజేశారు.