చేయని నేరం.. అవినీతి తనపై మోపారనే ఆవేదన.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్ల తీరుకు నెల్లూరు జిల్లాలో పౌరసరఫరాల సంస్థ డీఎం ఎన్.కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన డీఎం కృష్ణారెడ్డి సమావేశం అనంతరం తన కార్యాలయానికి చేరుకున్నాడు.
సమావేశం అనంతరం తన చాంబర్లోకి వెళ్లిన కృష్ణారెడ్డి జిల్లా అధికారి ఒకరికి ఫోన్ చేసి తన బాధను వ్యక్తం చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ విషయాన్ని తన భార్యకు కూడా ఫోన్ చేసి చెప్పి.. నీవు, పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేశాడని తెలిసింది. ఇంతలోనే కార్యాలయంలోని తన చాంబర్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
వెంటనే భార్య కార్యాలయానికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో సిబ్బంది తలుపులు పగులగొట్టి ఆయన్ను రక్షించారు. ఆమెను బొల్లినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుకున్న మంత్రి సోమిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
అక్కడే ఉన్న డీఎం భార్యతో మంత్రి మాట్లాడారు. డీఎం పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండి కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆత్మహత్యకు ముందు కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ రాశారు అని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ సూసైడ్ నోట్ మాయమవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఒక ఉన్నత ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.