ఎన్నికల సమయంలో వైసీపీలోకి వలసలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ నాయకలు అటుంచితే స్టార్ హీరోలు సైతం వైసీపీ వైపు చూస్తున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. అయితే పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పార్టీలో చేరుతున్న వారందరికి టికెట్ కేటాయింపు జగన్కు ఇబ్బందిగా మారింది. విభజన చట్టం ప్రకారం నియోజక వర్గాల పునర్విభజన జరిగింటే ఇబ్బందులు ఉండేవి కావు. కాని 2014 వరకు నియోజక వర్గాల పునర్విభజన ఉండదని కేంద్రం తేల్చి చెప్పింది.
అన్ని పార్టీల్లో ప్రధానంగా కొన్ని సీట్లు విషయంలో ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించే గుంటూరు లోక్సభ స్థానం టికెట్ కోసం అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ టీడీపీనుంచి గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నారు. మరో సారి అయన్నే బరిలోకి దింపాలని బాబు భావిస్తున్నారు. ఈ సారి గుంటూరు లోక్సభ స్థానాన్ని చేజిక్కించుకోవాలని వైసీపీ పట్టుదళతో ఉంది.
అయితే కొద్ది రోజులుగా పలువురు ప్రముఖులు వైసీపీ గుంటూరు లోక్సభ స్థానం కోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ను కలుస్తుండటం రాజకీయవర్గాలతో పాటు సినీవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. కొద్దిరోజుల క్రితం జూనియర్ ఎన్టీ ఆర్ మామ నార్నే జగన్ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.గుంటూరు ఎంపీ సీటు ఇవ్వాలని జగన్ను కోరినట్టు ప్రచారం జరుగుతోంది.
మరో వైపు కింగ్ నాగార్జున వైఎస్ జగన్తో భేటీ అవడంతో ఆయన పార్టీలో చేరుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్తున్నా….తన తన మిత్రుడికి గుంటూరు టికెట్ ఇవ్వాలని జగన్ను కోరినట్టు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వైసీపీ గుంటూరు లోక్ సభ సీటు కోసం జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున పోటీ పడుతున్నారనే టాక్ మొదలైంది. ఇద్దరిలో జగన్ ఎవరికి ఓటు వేస్తారో చూడాలి.