స్మార్ట్ ఫోన్, నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషుల్లో విపరీత ధోరణులు పెరిగిపోతున్నాయి. వాట్సప్, ఛాటింగ్ల ద్వారా వివాహేతర సంబంధాలు ఏర్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా సహజీవనం చేస్తున్న ప్రేమికుల మధ్య చిచ్చు రేపింది. దీంతో భర్త ఆత్మహత్య చేసుకోవడంతో 13 నెలల కుమారుడు అనాధయ్యారు.
వివరాల్లోకి వెల్తే….కడప జిల్లా, పులివెందులకు చెందిన ఎర్రగొండు చరణ్ తేజరెడ్డి నగరానికి వలసవచ్చాడు. కుత్బుల్లాపూర్లోని వాజ్పేయి నగర్లో ఉంటూ స్థానిక నర్సరీలో పని చేసేవాడు. ఇదే క్రమంలో నర్సరీకి వస్తున్న పావనితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా సహజీవనానికి దారి తీసింది. వీరికి కుమారుడు ధనుష్రెడ్డి(13 నెలలు) ఉన్నాడు.
వారం రోజుల క్రితం పావని ఫోన్కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ‘ఐలవ్ యూ’ పావని అంటూ మెసేజ్ వచ్చింది. దాని విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో మూడు రోజుల క్రితం పావని కుమారుడిని భర్త వద్ద వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన చరణ్ ఆమె కోసం గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో మనస్తాపానికిలోనైన అతను గురువారం రాత్రి ఇంట్లో చీరతో సీలింగ్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బాబు ఏడుపుతో ఈసంఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి బాబు ఏడుపులు విన్న స్థానికులు శుక్రవారం తెల్లవారు జామున చరణ్తేజ ఇంటి తలుపు తట్టారు. చరణ్ ఉరికి వేలాడుతూ ఉండటంతో అతని స్నేహితులకు సమాచారం అందించారు.వారు అక్కడికి వచ్చి చరణ్ మరణవార్తను పావనికి తెలియజేశారు. ఆమె నమ్మకపోవడంతో భర్త మృతదేహాన్ని ఫోటో తీసి వాట్సాప్కు పంపారు. కాని భార్య పావని నుంచి స్పందన రాలేదు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చరణ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు