వివాహేతర సంబంధం కుటుంబంలో విషాదాన్ని నింపింది. వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమెను ఇంటికి తీసుకొచ్చాడనె కోపంతో కూతురు తండ్రిని చంపేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లా కంచరపాలెంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెల్తే….భారతీయ రైల్వేలో పనిచేస్తున్న 48 ఏళ్ల సముద్రయ్య అనే వ్యక్తి, కంచరపాలెంలోని రవీంద్రనగరంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఓ మహిళతో సముద్రయ్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంపై ఇంట్లో గొడవలు జరిగినా సముద్రయ్యలో మార్పు రాలేదు. ఇక ఏకంగా ఆమెను ఇంటికి పిలుచుకురావడంతో గురువారం అర్ధరాత్రి ఈ విషయమై సముద్రయ్య, అతని భార్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆవేశానికి లోనైన సముద్రయ్య.. భార్యపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడు. తల్లిని కొడుతుండడం చూసిన వారి కూతురు బిబాషా… తండ్రిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కూతురిపై కూడా దాడి చేశాడు. దీంతో మనస్థాపానికి గురయిన బిబాషా క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తి తీసుకొచ్చి తండ్రిని పొడిచింది. దీంతో అక్కడే తండ్రి మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బిబాషాను, ఆమె తల్లి నాగలక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.