భారత్ తో యుద్ధం అంటూ పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పాక్ కు ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. కశ్మీర్(పీవోకే)లో ఉన్న ప్రాంతాలను మోదీ సర్కార్ స్వాధీనం చేసుకుంటుందని రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు మరవక ముందే ఆర్మీ చీఫ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)కు విముక్తి కల్పిస్తామనీ, పాకిస్థాన్ చెర నుంచి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటించేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు.
పీవోకేను పాకిస్థాన్ నుంచి స్వాధీనం చేసుకుని భారత్ లో అంతర్భాగం చేయడమే మా తదుపరి అజెండా. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే దేశంలోని వ్యవస్థలు నడుచుకుంటాయి. ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేసేందుకు ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమే’ అని రావత్ ప్రకటించారు.అనేక ఏళ్లుగా ఉగ్రవాదానికి కశ్మీర్ ప్రజలు బలయ్యారని, ఇప్పుడు అక్కడి ప్రజలు శాంతిని నెలకొల్పేందుకు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని రావత్ తెలిపారు.