ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో యూపీఏ హయాంలో పలు కీలక పదువులు నిర్వహించిన చిదంబరం ఎట్టకేలకు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా జరగుతున్న డ్రామాకు అరెస్ట్ తో తెరపడింది. ఈ పరిస్థితి తర్వాత… ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే… ఓ ఫ్లాష్ బ్యాక్ చిదంబరానికి చెంపపెట్టులా కనిపిస్తుంది. ఇప్పుడు అరెస్టు చేసిన సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ఒకప్పుడు ప్రారంభించింది చిదంబరమే కావడం శోచనీయం.
నిన్న రాత్రి పది గంటల సమయంలో సీబీఐ, ఈడీ అధికారులు, ఢిల్లీ పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు.చిదంబరం నిన్న రాత్రంతా ఓ చిన్న గదిలో కాలం వెళ్లబుచ్చారు. తొలుత చిదంబరాన్ని తమతో పాటు తీసుకెళ్లిన పోలీసులు, సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించి, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించారు. అంతా నార్మల్ గా ఉండటంతో సీబీఐ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గెస్ట్ హౌస్ లోని 5వ నంబర్ గదిలో ఉంచారు.
నేడు ఆయన్ను సీబీఐ కోర్టు ముందు హాజరు పరచనున్న అధికారులు, ఆ వెంటనే కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది. దీంతో సుప్రీకోర్టు వెల్లారు. అక్కడ కూడా చేదు అనుభవం ఎదురయ్యింది. అత్యవసరంగా విచారించడానికి సుప్రీం ఒప్పు కోక పోవడంతో అయన అరెస్ట్ ఖాయం అయ్యింది.
చిదంబరం కేంద్రంగా దేశ రాజధానిలో ఉత్కంఠభరిత మలుపులతో హైడ్రామా కొనసాగింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి చిదంబరం అనూహ్యంగా అదృశ్యమయ్యారు. మరో వైపు ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు సీబీఐ,ఈడీ.బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం అనూహ్యంగా దర్శనమిచ్చారు.
చిదంబరం కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్న విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు అక్కడికి వెళ్లేలోపే.. చెప్పాల్సింది చెప్పేసి వెంటనే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి తన న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్లతో కలిసి నేరుగా జోర్బాఘ్లోని తన ఇంటికి వెళ్లారు. అక్కడ చిదంబరం మద్దతు దారులు అడ్డుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓ పక్క నుంచి గోడ దూకి వారు ఇంట్లోకి వెళ్లారు. మరో పది నిమిషాల్లో సీబీఐకి చెందిన మరో టీమ్, ఈడీ అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకున్నారు.ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు కాసేపు చిదంబరంను ప్రశ్నించి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను తీసుకుని నేరుగా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.